జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం.. కోనేరులో పడి ముగ్గురు చిన్నారుల మృతి

  • మేడిపల్లి మండలం కొండాపూర్‌లో ఘటన
  • మృతుల్లో ఇద్దరు చిన్నారులు అన్నాచెల్లెళ్లు
  • మొక్కుల కోసం కుటుంబంతో కలిసి ఆలయానికి వెళ్లిన చిన్నారులు
  • ఈత కోసం కోనేరులోకి దిగి ప్రమాదవశాత్తూ నీట మునిగిన చిన్నారులు
  • ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సరదాగా ఆడుకోవడానికి వెళ్లిన ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మేడిపల్లి మండలం కొండాపూర్‌లోని శివగంగా ఆలయ కోనేరులో నిన్న సాయంత్రం ఈ ఘోర దుర్ఘటన జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. కొండాపూర్‌కు చెందిన భార్గవి-శేఖర్ దంపతుల కుమారుడు షార్వింద్ (7), జగిత్యాలకు చెందిన భారతి-భూషణం దంపతుల పిల్లలు మన్వీత్ (11), మనస్వి (9) మృతి చెందారు. వీరిలో మన్వీత్, మనస్వి అన్నాచెల్లెళ్లు. షార్వింద్ తల్లి భార్గవి గర్భవతి కావడంతో మొక్కులు చెల్లించుకోవడానికి వారి కుటుంబం ఆలయానికి వచ్చింది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు భార్గవి సోదరి భారతి తన పిల్లలతో కలిసి జగిత్యాల నుంచి వచ్చారు.

పెద్దలు పూజా కార్యక్రమ ఏర్పాట్లలో ఉండగా, ఈ ముగ్గురు చిన్నారులు ఆడుకుంటూ ఆలయ కోనేరు వద్దకు వెళ్లారు. ఈత కొట్టాలనే సరదాతో నీటిలోకి దిగిన వీరికి లోతు ఎక్కువగా ఉండటంతో ఈత రాక మునిగిపోయారు. చిన్నారుల కేకలు విన్న స్థానికులు వెంటనే వారిని బయటకు తీసి జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే వారు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన చిన్నారులు మృతిచెందడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ దుర్ఘటనతో కొండాపూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Kondapur Tragedy
Jagitial District
Children Drowning
Temple Pond Accident
Kondapur Village
Telangana News
Drowning Accident India
Manwith
Manaswi
Sharvind

More Telugu News